న్యూఢిల్లీ: ఆడ అయినా, మగ అయినా పిల్లలు తమకు ఇష్టమైతే తల్లి ఇంటి పేరును వినియోగించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court ) స్పష్టంచేసింది. పిల్లలు కచ్చితంగా తన ఇంటిపేరునే వినియోగించాలని ఆదేశించే హక్కు ఏ తండ్రికీ ఉండదని తేల్చిచెప్పింది. తన ఇంటి పేరునే వినియోగించాలని చెప్పడానికి కుమార్తె తండ్రి సొంత సొత్తేం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. తన కుమార్తె డాక్యుమెంట్లలో ఆమె తల్లి ఇంటి పేరుకు బదులుగా తన ఇంటిపేరును చేర్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలంటూ ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ రేఖా పల్లి ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
అయితే, పిటిషనర్ కోరినట్లు బాలిక ఇంటిపేరును మార్చేలా అధికారులను ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది. కుమార్తె కచ్చితంగా తన ఇంటిపేరునే వినియోగించాలని ఆజ్ఞాపించేందుకు తండ్రికి ఎలాంటి హక్కులు ఉండవని, అలా ఆజ్ఞాపించడానికి కూతురేం తండ్రి సొంత సొత్తు కాదని జడ్జి వ్యాఖ్యానించారు. బాలికకు తన తల్లి ఇంటి పేరును వినియోగించడం ఇష్టమే అయినప్పుడు తండ్రికి వచ్చిన సమస్య ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ కుమార్తె మైనర్ అని, ఆమె తన తల్లి బలవంతం మీద ఇంటిపేరును మార్చుకున్నదని చెప్పారు.
తన క్లయింట్ ఆయన కుమార్తె పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు చేశాడని, ఇప్పుడు ఇంటి పేరులో మార్పు కారణంగా భవిష్యత్తులో ఆ పాలసీలు క్లెయిమ్ చేసుకోవడం క్లిష్టమవుతుందని వివరించారు. అతని వాదనలు విన్న కోర్టు.. పిటిషనర్ తన కూతురు ఇంటిపేరును మార్పించుకోవాలంటే పాఠశాలలో, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని.. కానీ, కోర్టుకు మాత్రం అలాంటి ఆదేశాలు జారీచేసే అధికారం లేదని తెలిపింది.