చెన్నై: కరోనా సంక్షోభ సమయంలో ఒక సంస్థ బలవంతంగా ఒక వ్యక్తిని జాబ్ నుంచి తీసేసింది. అనంతరం కరోనా బారినపడి ఆ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే తన భర్త పని చేసిన సంస్థ నిబంధనల ప్రకారం వ్యవహరించి ఉంటే అందే బీమా, పరిహారం కోసం అతడి భార్య న్యాయపోరాటం చేపట్టింది.
తమిళనాడుకు చెందిన 48 ఏండ్ల కామేశ్వరి భర్త రమేష్ సుబ్రమణియన్ చెన్నైలోని సైనమీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఏడాదికి రూ.30 లక్షల వేతనం అందుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న ఆయనను ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆ సంస్థ హెచ్ఆర్ జూమ్లో సంప్రదించారు. ఉద్యోగుల తొలగింపు డ్రైవ్లో భాగంగా రిజైన్ చేయాలని సుబ్రమణియన్కు చెప్పారు.
నిబంధనల ప్రకారం నోటీస్ ఇచ్చిన రెండు నెలల వరకు పని చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సుబ్రమణియన్ ప్రాధేయపడ్డారు. ఈలోపు మరో సంస్థలో ఉద్యోగం చూసుకుంటానని చెప్పారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ ఆయనపై మరింత ఒత్తిడి తెచ్చింది. జాబ్కు రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్లో ఉద్యోగం కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక ఏప్రిల్ 13న ఆయన రాజీనామా చేశారు.
కాగా, ఉద్యోగం కోల్పోయి తీవ్ర మనస్తాపంలో ఉన్న సుబ్రమణియన్కు జూన్లో కరోనా సోకింది. వైద్యం కోసం ఆయన కుటుంబం సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జూన్ 11న కరోనాతో ఆయన మరణించారు.
అయితే నిబంధనల ప్రకారం ఆ సంస్థ తొలగింపు నోటీస్ ఇచ్చిన తర్వాత రెండు నెలల పాటు తన భర్త జాబ్లో కొనసాగి ఉంటే తమకు ఇన్సురెన్స్, పరిహారం కింద రూ.1.5 కోట్లు వచ్చేవని భార్య కామేశ్వరి తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం కోసం ఆ సంస్థపై ఆమె న్యాయపోరాటం చేపట్టింది. ఆర్థిక సహాయంగా రూ.2 లక్షలు ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేయగా ఆమె నిరాకరించింది.
మరోవైపు సుబ్రమణియన్ తన ఇష్ట పూర్వకంగానే జాబ్కు రాజీనామా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఆ సంస్థ వాదనను ఖండించిన బాధిత సుబ్రమణియన్ కుటుంబం ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖను కూడా ఆశ్రయించింది. కరోనా సమయంలో బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసివేయద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీనికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో నియమం ప్రకారం నిర్ణీత సమయంలోగా సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ కేంద్ర కార్మిక శాఖ ఆ సంస్థను ఆదేశించింది.