Pragilal Jatav | ఎదుటిపార్టీలపై రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం సహజమే. ఒక్కోసారి ఈ విమర్శలు, ఆరోపణలు నవ్వు తెప్పిస్తుంటాయి. అయినా, తగ్గేదేలే..! అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాగే వ్యవహరించిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్ ఆయనను నవ్వులపాలు చేస్తున్నది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ పర్యటన సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ఈ కామెంట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆఫ్రికా నుంచి తెచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో వదిలిపెట్టారు. అక్కడి అధికారులు వాటి ఆలనాపాలనా చూస్తున్నారు. కొన్నిరోజులపాటు ఇతర చిరుతపులులతో కలువకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగీలాల్ జాతవ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆఫ్రికా నుంచి తెచ్చిన చిరుతపులులపై ఆయన విచిత్రమైన కామెంట్స్ చేశారు.
‘బీజేపీ జంతువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆఫ్రికా నుంచి చిరుతలను తీసుకొచ్చి కునో పార్క్లో వదిలిపెట్టారు. ఈ చిరుతలు ఇక్కడ బాగా బలిసి కాంగ్రెస్ ఓటర్లను మట్టుబెడతాయి’ అని జాతవ్ పేర్కొన్నారు. అంతటితో ఆగని ఆయన.. ఈ చిరుతలను రప్పించేందుకు బీజేపీ రూ.117 కోట్లు ఖర్చుచేసిందని వెల్లడించారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. ఈ చిరుతలు ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయని, ఎన్నికల సమయంకల్లా పెద్దవై కాంగ్రెస్ ఓటర్లను తినేస్తాయని చెప్పుకొచ్చారు. ఇలా ఓట్లు తగ్గి మన అభ్యర్థి ఓడిపోతాడని కూడా సెలవిచ్చాడు.
శివపురి జిల్లాలోని కరేరా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రగీలాల్ జాతవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జస్మంత్ జాతవ్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. 2020 నవంబర్ నెలలో జరిగిన ఉప ఎన్నికలో ప్రగీలాల్ జాతవ్ దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.