బెంగళూరు, ఆగస్టు 4: జాబిల్లి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్లో శనివారం మరో కీలక ఘట్టం జరగనున్నది. చంద్రుడి దిశగా పరుగులు పెడుతున్న చంద్రయాన్ స్పేస్క్రాఫ్ట్ మరో అడుగు ముందుకు వేయనున్నది. ప్రస్తుతం భూమి- చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్ శనివారం చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టనున్నది. నేటి రాత్రి 7 గంటలకు స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ఇప్పటికే ఈ స్పేస్క్రాఫ్ట్ మూడింట రెండొంతుల ప్రయాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపింది. నిర్దేశిత ఐదు భూ కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ ఆగస్టు 1న భూమి- చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం విదితమే. చంద్రయాన్-3 జాబిల్లికి అతి దగ్గరగా (పెరిలూన్) ఉన్న సమయంలో దాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సవ్యంగా సాగుతున్నదని, ఆగస్టు 23న జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొంది.