చెన్నై: తమిళనాడులో స్థానిక ఎన్నికలపై సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమక్షంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. శివగంగ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు ఘర్షణకు దిగారు. చైర్స్తో కొందరి వెంటపడి వాటిని విసిరేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శివగంగ ఎంపీ అయిన ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అభ్యర్థుల మార్పు కోసం కొందరు డిమాండ్ చేయగా మరి కొందరు వారిపై కుర్చీలు విసురుతూ బయటకు తరిమారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.