న్యూఢిల్లీ : అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ సభ్యులను కోరారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం సభకు చైర్మన్ మాస్క్ ధరించి వచ్చారు. విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన ధంఖర్.. సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాజ్యసభ సభ సమావేశం ప్రారంభంలో తెలిపారు.
పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ సభ్యులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంఘటితం కావాలన్నారు. అందరి సమన్వయ కృషితో కొవిడ్ సవాల్ను భారత్ అధిగమించిందన్నారు. మరో వైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం గురువారం మాస్క్ ధరించి సభకు హాజరయ్యారు. విదేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలను అనుసరించాలని సూచించారు.