LPG supply : దేశంలోని వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోవడం, హార్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకలు భారత్ బయల్దేరడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి సానుకూల వాతావరణం ఏర్పడ్డ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో సంక్షోభం తొలగడంతో ఇరాన్ సహా గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా మెరుగుపడనుంది. ప్రస్తుతం అనేక ఎల్పీజీ నౌకలు హార్ముజ్ దాటాయి. ఇండియా చేరుకోనున్నాయి. దీంతో దేశంలోని రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 టీఎంటీలకు తగ్గకుండా సాగుతోంది. అయితే, ఇప్పటివరకు గృహ వినియోగదారులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ ఎల్పీజీని గృహ వినియోగానికే కేటాయించింది. అలాగే, వాణిజ్య సిలిండర్ల సరఫరాను తగ్గిస్తూ, ఆంక్షలు విధించింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు నెలల క్రితం నుంచి ఆంక్షలు విధిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆంక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై మునుపటిలాగే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలకు, పరిశ్రమలకు మేలు జరగనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానుంది. మరోవైపు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, సిలిండర్లు సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోళ్లు చేశారు వ్యాపారులు. దీంతో పలు ఆహారోత్పత్తుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడ్డారు. మరి, ఇకపై అయినా ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయేమో చూడాలి.