న్యూఢిల్లీ: ఉచిత రేషన్ పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చిలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద తెల్ల రేషన్ కార్డు, అంతోద్యయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కలిగిన ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మరోసారి కేంద్రం పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ‘భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేయడానికి, సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటారు’ అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, దేశంలోని పేదలెవరూ కూడా ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆహార పథకాన్ని ప్రధాని మోదీ మరోసారి ఆరు నెలలు పొడిగించారని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీంతో రూ.3.4 లక్షల కోట్ల విలువైన 1,003 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఈ పథకం కింద ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు.