కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై తృణమూల్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, మొత్తానికి మొత్తం కూల్చేయాలని చూస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా పార్లమెంట్ వ్యవస్థను కూడా విషతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. రాజ్యసభలో మెజారిటీ సృష్టించుకోవడం కోసం ప్రతిపక్ష సభ్యులను కేంద్రం సస్పెండ్ చేసిందని అన్నారు. సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలతో కలిసి ఆయన పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పై విధంగా స్పందించారు. మరో వైపు రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించారంటూ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.