న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో రోజురోజుకూ తన రికార్డును తానే బద్దలుకొట్టుకుంటూ వెళ్తోంది ఇండియా. మరోవైపు ఆక్సిజన్ సరఫరా సరిగా లేక కొవిడ్ పేషెంట్లు మృత్యువాత పడుతుండటం అసలైన విషాదం. ఇలాంటి సమయంలో కొవిడ్ పేషెంట్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయండని సలహా ఇచ్చింది. ముఖ్యంగా ఇంట్లోనే స్వల్ప లక్షణాలతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఉదరభాగంపై బరువు వేసి బోర్లా పడుకోవడమే ఈ టెక్నిక్. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అంటారు. ఇది వెంటిలేషన్ను మెరుగుపరుస్తుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 కంటే కిందికి పడిపోయినప్పుడే ఈ పని చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ను పరిశీలిస్తుండటం, ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర స్థాయిలను హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్లు చూసుకుంటూ ఉండాలని స్పష్టం చేసింది. సరైన సమయంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవచ్చని కూడా తెలిపింది.
ప్రోనింగ్ ఎలా చేయాలో కూడా చెబుతూ కొన్ని వాటిని వివరించే ఫొటోలను ట్వీట్ చేసింది. ఒక మెత్త (తలగడ) మెడ కింద, మరొకటి లేదా రెండు ఛాతీ నుంచి తొడల వరకు, మరో రెండు మోకాళ్ల కింద పెట్టుకోవాలని సూచించింది. గర్భవతులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు, వెన్నెముకకు గాయమైన వాళ్లు దీనికి దూరంగా ఉంటే మంచిదని స్పష్టంచేసింది. భోజనం చేసిన తర్వాత కూడా ఈ పని చేయొచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?