ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది. ఇకపై కమాండోలు కుమార్ విశ్వాస్ భద్రతను చూసుకుంటారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కుమార్ విశ్వాస్కు భద్రత కల్పించే విషయంపై హోంశాఖ సమీక్ష నిర్వహించింది. కుమార్ విశ్వాస్కు ముప్పు పొంచి వుందన్న నిఘా వర్గాల సమాచారంతో ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
‘వై’ కేటగిరీ భద్రత అంటే…
ఈ భద్రతలో మొత్తం 11 మంది సెక్యూరిటీ ఉంటారు. ఈ 11 మందిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు. ఇందులో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగతా వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా… ఆయన వెంటే ఉంటారు. షిఫ్టుల ప్రకారం వీరు విధులు నిర్వర్తిస్తుంటారు.
కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణ ఏమిటంటే…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ తనతో అన్నారని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. పంజాబ్ అంటే సీఎం కేజ్రీవాల్కు ఏమాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ అంటే రాష్ట్రం కాదని, అదో భావన అని ఆయన పేర్కొన్నారు.
‘నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా. వేర్పాటువాదులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిచ్చే వారితో కలవొద్దని నేను చెప్పాను. కాదు.. కాదు.. నేను కలుస్తానని అన్నారు. ఏమీ ఆలోచించాల్సిన పనిలేదన్నారు. అయితే వేర్పాటువాదులతో చేతులు కలపొద్దని నేను అన్నాను. ఏమవుతుంది? నేనే మొట్ట మొదటి ప్రధాని అవుతా. అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే పంజాబ్ సీఎం కావడానికి కూడా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే వుంటారు అని’ కుమార్ విశ్వాస్ వెల్లడించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేయగలరని కుమార్ విశ్వాస్ విమర్శించారు.