(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కూలీల కడుపు నింపే ఉపాధి హామీ పథకంపై కేంద్రం కక్ష సాధింపులకు దిగుతున్నది. కూలి డబ్బులు రాక, తినడానికి తిండి గింజలులేక కూలీలు పెట్టేబేడా సర్దుకొని వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా విపక్ష రాష్ర్టాలపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నది. బీహార్కు మంజూరు చేయాల్సిన రూ.వెయ్యి కోట్లకు పైగా ఉపాధి నిధులను విడుదల చేయకుండా కొన్నేండ్లుగా తాత్సారం చేస్తున్నది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఆగస్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకొని, విపక్ష పార్టీ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఉపాధి హామీ నిధుల చెల్లింపులు నిలిచిపోయాయని, కేంద్రం కావాలనే నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని ఆరోపణలున్నాయి. నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలు వలస బాట పడుతున్నారని సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి అవకాశాలు తగినంత లేకపోవడంతో బీహార్లో అధిక శాతం గ్రామీణులు ఉపాధి హామీ పనులపైనే ఆధార పడతారని గ్రామీణాభివృధ్ధి మంత్రి శర్వాన్ కుమార్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కంటే ఎక్కువ గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలు అవుతున్నదని, కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా పనులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికే బీహార్లో 15 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని, మరో పది కోట్ల పనిదినాలకు నిధులు మంజూరు చేయాలని కోరితే 2.5 కోట్ల పనిదినాలకే కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఏడాదిలో ఒక్కో కూలీకి ఉపాధి కల్పించే రోజుల సంఖ్య 100 నుంచి 200కు పెంచాలని నితీశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణకూ బకాయి
తెలంగాణకు కూడా ఉపాధి హామీ కూలీ పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు. రాష్ర్టానికి బకాయిపడ్డ రూ.110 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇటీవలే కేంద్రానికి లేఖ కూడా రాశారు. రెండు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారనని ఆవేదన వ్యక్తం చేశారు.