న్యూఢిల్లీ: దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా 44 శాతం కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్ లేదని కేంద్రం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిస్తూ మొత్తం 2.17 కోట్ల కుటుంబాలకుగాను 1.2 కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్ లేదని చెప్పారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలన్నింటికీ 2024 నాటికి నీటి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ర్టాలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మరో మంత్రి బిశ్వేశ్వర్ టుడు మాట్లాడుతూ దేశంలోని 146 ముఖ్యమైన రిజర్వాయర్లలో నీటి నిల్వను వారానికోసారి సీడబ్లూసీ సమీక్షిస్తున్నదని వెల్లడించారు.