CBI-Nursing Exam | నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల ఎయిమ్స్-ఢిల్లీ నిర్వహించిన పరీక్ష పేపర్ లీకైందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు శ్రీకారం చుట్టుంది. ఈ విషయమై కేసు నమోదు చేసింది. పంజాబ్ లోని మొహాలీలోని జియాన్ జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, రితూ అనే అభ్యర్థిపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు చెప్పారు.
పలు దవాఖానల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి ఎయిమ్స్-ఢిల్లీ ఈ నెల మూడో తేదీన కామన్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ నిర్వహించింది. ఈ పరీక్ష జరిగిన రోజే ప్రశ్నాపత్రాల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో పేపర్ లీకైందని భారీగా ప్రచారం జరిగిందని ఎయిమ్స్-ఢిల్లీ అధికారులు తెలిపారు.
రంగంలోకి దిగిన అధికారులు సంబంధిత స్క్రీన్ షాట్లు పరీక్షించిన తర్వాత జియాన్ జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సంస్థ సెంటర్ లో పరీక్ష రాసిన రితూ అనే అభ్యర్థి తన ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఎగ్జామ్ సెంటర్ తోపాటు రితూపైనా కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు.