Crime News | న్యూఢిల్లీ : ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన సమీర్ అహ్మద్(25) తన స్నేహితుడు బిలాల్తో కలిసి మద్యం తాగాడు. మద్యం సేవిస్తున్న సమయంలో సమీర్ బిలాల్ను కొరికాడు. దీంతో కోపంతో ఊగిపోయిన బిలాల్ తన స్నేహితులకు సమాచారం అందించాడు. బిలాల్ ఫ్రెండ్స్ చేరుకునే లోపే సమీర్ పరుగెత్తాడు.
దీంతో సమీర్ కాళ్లపై కాల్పులు జరపడంతో అతను పరుగెత్తలేక ఓ కిరాణం దుకాణం ముందు పడిపోయాడు. బిలాల్తో పాటు మరో నలుగురు యువకులు.. సమీర్పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనను స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సమీర్ను జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.
హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బిలాల్, సౌద్, ఫిరోజ్, సలీంలను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ నలుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధిస్తామన్నారు.
ఇక సమీర్పై దాడిని అడ్డుకోబోయిన ఓ వ్యక్తి చెంపపై ఓ నిందితుడు కొట్టాడు. దీంతో అతను భయపడి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మిగతా వారు కూడా అడ్డుకునే సాహసం చేయలేదు. సమీర్ కిరాణ దుకాణం ముందు పడిపోవడంతో.. ఆ షాపు యజమాని ఆందోళనకు గురై దుకాణాన్ని మూసే ప్రయత్నం చేశాడు.