న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గిందని సంతోషపడే లోపే మహమ్మారి మళ్లీ డెల్టా ప్లస్(ఏవై.4.2) రూపంలో ప్రపంచదేశాలను చుట్టుకొని వస్తున్నది. బ్రిటన్ కేంద్రంగా అనేక దేశాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే ఇండియా సహా 33 దేశాల్లో డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. తాజాగా కర్ణాటకలో ఏడుగురిలో ఈ వైరస్ బయటపడటం ఆందోళనను రేకెతిస్తున్నది. ఈ వేరియంట్ను తొలుత ఏప్రిల్లో గుర్తించారు. దీనికి మూలం ఎక్కడ, ఎప్పుడు వ్యాప్తి మొదలైందన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. తెలంగాణలో కూడా ఈ కేసులు బయటపడ్డాయి. అయితే, ఇండియాలో ఏవై.4.2 వ్యాప్తి పెద్దగా లేదని, భయపడాల్సిన అవసరం లేదని ఇన్షాకాగ్ బుధవారం తెలిపింది. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ, వ్యాధి తీవ్రతను కలుగజేసే అంశంలో డెల్టా కంటే తీవ్రమైందని చెప్పేందుకు ఆధారాల్లేవని పేర్కొన్నారు.
ఇంగ్లండ్లో 96% ఇవే
ఇంగ్లండ్లో రోజూ సగటున 15వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో 96% కేసులు డెల్టా ప్లస్ వేరియంట్వే కావడం అక్కడ ఈ వేరియంట్ ఉద్ధృతిని తెలియజేస్తున్నది. యూకేతో పాటు డెన్మార్క్, జర్మనీ. ఐర్లాండ్ దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అమెరికా, రష్యాలో కూడా అక్కడక్కడా ఈ కేసులు బయటపడ్డాయి. ఇంగ్లండ్ నుంచి విదేశాలకు వెళ్లినవారి నుంచి ఈ వేరియంట్ వ్యాపిస్తున్న సందర్భాలున్నాయి. ఇండియాలో ఇరవై కంటే పైగా ఏవై.4.2 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డ రాష్ర్టాలు: కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్ముకశ్మీర్.