న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లో ఉండే కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ అమాయకులను దోచుకోవడానికి మోసగాళ్లకు ఉపయోగపడుతున్నది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) జారీ చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు సాధారణ ప్రజలకు ఫోన్ చేసి, తాము కొరియర్ లేదా డెలివరీ సర్వీస్ ఏజెంట్లుగా చెప్పుకుంటున్నారు. ప్యాకేజీని కన్ఫర్మ్ చేయాలని, లేదా రీషెడ్యూల్ చేయాలని సాకు చెప్తున్నారు. ఈ సంభాషణ సాధారణమైనదిగానే కనిపిస్తుంది. డెలివరీ విషయంలో ఓ చిన్న సమస్య వచ్చిందని, వివరాల ధ్రువీకరణ కోసం ఓ చిన్న కోడ్ను డయల్ చేయాలని చెప్తారు. ఈ కోడ్ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఈ కోడ్కు ముందు 21, 61 లేదా 67 ఉంటాయి. ఈ కోడ్ను డయల్ చేసినవారి ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇన్ కమింగ్ కాల్స్ను ఆ మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఫోన్ నంబరుకు పంపిస్తుంది.
యూఎస్ఎస్డీ కాల్స్ దుర్వినియోగం
అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్డీ) అనే టెలికాం ప్రోటోకాల్ వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నెట్వర్క్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. దీనిని ఈ కుంభకోణానికి మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే వెరిఫికేషన్ కాల్స్, చెల్లింపుల కోసం వచ్చే కన్ఫర్మేషన్ ఓటీపీలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫాంల నుంచి వచ్చే ఆథెంటికేషన్ మెసేజ్లు యూజర్లకు కాకుండా మోసగాళ్లకు చేరుతాయి. గుర్తు తెలియని కాలర్లు పంపించే యూఎస్ఎస్డీ కోడ్స్ ప్రారంభంలో 21. 61 లేదా 67 ఉంటే, ఆ కోడ్లను డయల్ చేయవద్దు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేషన్లో ఉందని యూజర్లకు అనుమానం వస్తే, వెంటనే ##002# కు డయల్ చేసి అన్ని ఫార్వర్డింగ్ సర్వీసులను డీయాక్టివేట్ చేయాలి. బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి ఫోన్ చేయాలి.