న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశవ్యాప్తంగా కులప్రాతిపదికన జనాభా లెక్కలు నిర్వహించాలన్న డిమాండ్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. కులాల వారీగా జనగణనకు అనేక రాష్ర్టాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వీరిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. జనాభా లెక్కల్లో ‘కులం ఏమిటి’ అన్న కాలమ్ కూడా ఉండాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. కులాల వారీగా జనాభా లెక్కల డిమాండ్తో బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సోమవారం ప్రధాని మోదీని కలువనున్నారు. బీహార్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ బీజేపీకి మిత్రపక్షం కాగా.. ఒకే అంశంపై ప్రతిపక్షాలు అధికార పక్షం ఏకతాటిపైకి రావడం విశేషం. అయితే ఈసారి కూడా జనాభా లెక్కల ప్రొఫార్మాలో ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలు అన్న మూడే కాలమ్లు ఉన్నాయి. ముఖ్యంగా బీసీల జనాభా ఎంతుంది అనే లెక్కల కోసమే రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. బీసీ ఓటు బ్యాంకును కాపాడుకొనే విధంగా పథకాల రూపకల్పనకు ఈ లెక్కలు ఉపయోగపడతాయని రాజకీయ నాయకులు భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు.
కేంద్రం నాన్చుడు ధోరణి
ఈ అంశంపై కేంద్రం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నది. జూలై 20న కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో మాట్లాడుతూ ‘విధాన పరంగా ఎస్సీ, ఎస్టీలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు సేకరించవద్దని కేంద్రం నిర్ణయం తీసుకొన్నద’న్నారు. ‘కులం ఆధారంగా లెక్కలు నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ విషయమైనా జనాభా లెక్కలు ముగిసిన తర్వాత ఆలోచిస్తాం’ అని సామాజిక న్యాయశాఖ కార్యదర్శి సుబ్రమణ్యం తెలిపారు.
1931 నుంచి లెక్కించలేదు
2021లో నిర్వహించే జనాభా లెక్కలను కులాలవారీగా సేకరించాలని బీహార్ అసెంబ్లీ 2019, 2020ల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. ఇదే విషయంపై నితీశ్కుమార్, తేజస్వీ యాదవ్ ఇప్పటికే మోదీకి వేర్వేరుగా లేఖలు రాశారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని అందులో కోరారు. కులాల ఆధారంగా జనాభా లెక్కలు సేకరించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఇప్పుడు చెప్తున్న లెక్కలు అంచనాలే. సంక్షేమ పథకాల రూపకల్పనలో కుల ఆధారిత జనగణన కీలకం అని పలువురు భావిస్తున్నారు.