న్యూఢిల్లీ : సీఎన్జీ ధరల పెరుగుదలకు నిరసనగా ఓలా, ఊబర్ ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు విపరీతంగా పెరగడంతో పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను నడపడం తమకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎన్జీ ధరలు కిలోకు రూ 70కి చేరాయని, ఇప్పటికీ తాము పాత చార్జీలతోనే క్యాబ్లు, ఆటోలు నడుపుతున్నామని, పెరిగిన ధరలతో వీటిని నడపడం తమకు ఇక సాధ్యం కాదని వాహన డ్రైవర్లు స్పష్టం చేశారు.
తమ చార్జీలను సవరించాలని లేని పక్షంలో పెరిగిన సీఎన్జీ ధరలను వెనక్కితీసుకోవాలని సర్వోదయ డ్రైవర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి రాధోడ్ డిమాండ్ చేశారు. వరుసగా రెండు రోజులు సీఎన్జీ ధరలను పెంచడంతో దేశ రాజధానిలో సీఎన్జీ ధర కిలోకు రూ 69.11కు ఎగబాకింది. గత నెలరోజులుగా సీఎన్జీ ధరలు ఏకంగా కిలోకు రూ 13.1 భారమయ్యాయి.