Businessman Suicide | బెంగళూరులో వ్యాపారవేత్త ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయిన ఆయన మృతదేహాన్ని నేతిగెరు గ్రామం సమీపంలో నిలిపివుంచిన కారులో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ఆయన వద్ద దొరికన సూసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆరుగురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. తనను మానసికంగా హింసించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు నోట్లో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వ్యాపారవేత్త ఎస్ ప్రదీప్ ఆదివారం రాత్రి నేతిగెరె గ్రామం సమీపంలో తన కారులో శవమై కనిపించాడు. నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తున్నది. పోలీసులు ఆయన నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో పాటు ఆరుగురు వ్యక్తులు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే బాధ్యులని సూసైడ్ నోట్లో మృతుడు పేర్కొన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోపి, సోమయ్య సూచనల మేరకు 2018 లో బెంగళూరులోని ఓ క్లబ్లో ప్రదీప్ రూ.1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్లో పనిచేసినందుకు జీతంతోపాటు ప్రతి నెలా రూ.3 లక్షలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, చాలా నెలలుగా డబ్బు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. తన పెట్టుబడి తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. దాంతో ఆయన గోపి, సమ్మయ్యల విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే వారిని పిలిపించి మాట్లాడగా.. రూ.90 లక్షలు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. అయినప్పటికీ తనకు డబ్బులు ఇవ్వకపోగా ఎమ్మెల్యే అండ చూసుకని తనను మానసికంగా వేధించారని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో పాటు ఆరుగురి పేర్లు రాశాడు.