లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ (BSP) 53 మందితో అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. ఇంతకు ముందు రెండో విడుత ఎన్నికల కోసం 51 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి ‘హర్ పోలింగ్ బూత్ కో జీతానా.. హై బీఎస్పీ కో పవర్ హై’ అని నినాదాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. మైన్పురిలోని కర్హల్ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆయనపై పోటీ చేసేందుకు కుల్దీప్ నారాయణ్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హత్రాస్ ఎస్సీ టికెట్ను సంజీవ్కుమార్ కాకా, సదాబాద్ నుంచి డాక్టర్ అవిన్ శర్మ, సికంద్రరావు నుంచి ఠాకూర్ అవధేశ్ కుమార్ సింగ్, ఫిరోజాబాద్లోని తుండ్ల నుంచి అమర్ సింగ్ జాతవ్, జస్రానా నుంచి సూర్యప్రతాప్ సింగ్, ఫిరోజాబాద్ నుంచి బబ్లు కుమార్ రాథోర్, షికోహాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఠాకూర్ రాఘవేందర్ సింగ్ సిర్సాగంజ్ నుంచి బీఎస్పీ నుంచి బరిలోకి బరిలోకి దిగనున్నారు. కాగా, 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్లో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుత పోలింగ్ వచ్చే 10న, చివరి విడుత ఎన్నికలు మార్చిలో జరుగనున్నాయి.