యూపీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తన పార్టీ మెరుగైన ప్రదర్శన ప్రదర్శించాలంటే తనకు నమ్మకస్తులు, కుటుంబీకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగానే సంస్థాగతంగా మాయావతి పార్టీలో కీలక మార్పులు చేశారు. కుటుంబీకులకు రెండు కీలక పదవులు కట్టబెట్టారు.
తమ్ముడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను రంగంలోకి దింపారు. వీరిద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను నియమించారు. ఇక పార్టీలో నెంబర్ 2, అంటే మాయావతి తర్వాతి స్థానాన్ని ఆమె తమ్ముడు ఆనంద్ కుమార్కు అప్పగిస్తూ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక యూపీ ఎన్నికల్లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బీఎస్పీకి గట్టి పోటీ ఇచ్చారు. బీఎస్పీ ఓట్ బ్యాంకును కూడా లాగేసుకున్నారు. దీంతో మాయావతి తిరిగి తన ఓటు బ్యాంకును రాబట్టే పనిలో ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు గట్టి పోటీ ఇవ్వడానికి తన అల్లుడు ఆకాశ్ ఆనంద్ను రంగంలోకి దింపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులను పార్టీ వైపు తిప్పాలని సూచించారు. అంతేకాకుండా ఓ 150 మంది ఎస్సీ యువకులను తీసుకొని, పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు కూడా చూసుకోవాలని, ఇప్పటి నుంచే సోషల్ మీడియాను యాక్టివ్ చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆదేశించారు.