బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తనకు ప్రధాని, యూపీ సీఎం తప్ప రాష్ట్రపతి అయ్యే కోరికే లేదంటూ మాయావతి గురువారమే అఖిలేశ్కు కౌంటర్ ఇచ్చింది. తాజాగా శుక్రవారం మళ్లీ అఖిలేశ్పై మాయావతి విరుచుకుపడ్డారు.
తాను ప్రధాని కావాలనే మాయావతి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుందని తాజాగా అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. ఈ విమర్శలకు మాయావతి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన కలలను సాకారం చేసుకోని వారు, ఇతరుల కలలను ఎలా నెరవేరుస్తారు? అంటూ ట్విట్టర్ వేదిగా మాయావతి దెప్పిపొడిచారు.
అఖిలేశ్ యాదవ్ తన కలనే నెరవేర్చుకోలేకపోయాడు (యూపీ సీఎం). ముస్లింలు, యాదవుల ఓట్లు పొందినా, తన కలను నెరవేర్చుకోలేదు. తన కలనే నెరవేర్చుకోలేని వారు ప్రధాని కావాలన్న ఇతరుల కలను ఎలా నెరవేరుస్తారు? అంటూ మాయావతి ఫైర్ అయ్యారు.