భోపాల్: అక్కాతమ్ముడు నకిలీ ఐఏఎస్ అధికారులుగా అవతారమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరి నుంచి పది లక్షల వరకు వసూలు చేసి మోసగించారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాప్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. (Brother-sister pose fake IAS officers) మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖలో అదనపు డైరెక్టర్గా తృప్తి సింగ్ రాజ్పుత్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో అధిపతిగా సోదరుడు సుధాన్షు రాజ్పుత్ పనిచేస్తున్నట్లు కొందరిని నమ్మించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేశారు.
కాగా, 2025 ఏప్రిల్ 7న చందేరికి చెందిన కొందరు వ్యక్తులు రూ.9.8 లక్షలు వారికి చెల్లించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తమ పత్రాలను అందజేశారు. అయితే వారికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో తాము మోసపోయినట్లు బాధితులు గ్రహించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్నగర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా ఆదేశాల మేరకు ఆ బాధితులు నిందితులతో సంప్రదింపులు కొనసాగించారు. కొత్త ఉద్యోగ అభ్యర్థులు ఉన్నారని నమ్మించి వారిని తిరిగి చందేరికి రప్పించారు.
మరోవైపు తృప్తి, ఆమె సోదరుడు కారులో చందేరికి చేరుకున్నారు. దీంతో ట్రాప్ వేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. తృప్తి వద్ద ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భోపాల్లోని వారి రహస్య స్థావరాలకు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. వారి సహచరులుగా భావిస్తున్న తనుజ్ బైశ్య, అంజలి సింగ్ పేర్లను కూడా కేసులో చేర్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వీరి మోసాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.