డెహ్రాడూన్: ఇటుక బట్టీ గోడ కూలింది. (brick kiln wall collapse) ఈ సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. అధికారులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు. ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లహ్వౌలి గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద కొందరు కూలీలు పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇటుక బట్టీకి చెందిన ఒక గోడ కూలింది. అక్కడ పని చేస్తున్న కూలీలపై పడింది. దీంతో ఇటుకల కింద కూలీలు చిక్కుకున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు స్పందించారు. జేసీబీని రప్పించి ఇటుక శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను రూర్కీలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరిద్వార్ కలెక్టర్ ధీరాజ్ సింగ్ గర్బియాల్, హరిద్వార్ ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోభాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.