అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోమంత్రి సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర అధికారులు, రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యకు స్వస్తి పలకడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని కూడా రూపొందించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడుతూ అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైందని అమిత్షా పేర్కొన్నారు. మొత్తం 12 అంశాలపై గొడవలుండగా… 6 అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు ఓ అంగీకారానికి వచ్చారని, సంతకాలు కూడా చేశారన్నారు. అంటే.. దాదాపుగా 70 శాతం సమస్య పరిష్కారమైందని వివరించారు. ఇక.. మిగతా 6 అంశాలపై కూడా త్వరలోనే ఓ అంగీకారం కుదురుతుందని ప్రకటించారు. 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి చిత్త శుద్ధితో కృషి చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్షా ధన్యవాదాలు తెలిపారు.
హోం మంత్రికి ధన్యవాదాలు : మేఘాలయ సీఎం
సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో తగిన సూచనలిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు తమ రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని సీఎం కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం మొదటి దశ తీర్మానాలు జరిగాయని పేర్కొన్నారు. ఇక… ఈ కమిటీలో కీలక పాత్ర పోషించిన అధికారులకు, అసోం ముఖ్యమంత్రి హిమంతకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన వివాదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని సీఎం కోన్రాడ్ సంగ్మా తెలిపారు.
ఇదో చారిత్రకమైన రోజు : హిమంత విశ్వ శర్మ
ఇదో చారిత్రకమైన రోజు అని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ అభివర్ణించారు. మిగతా వివాదాలను కూడా త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తాము తమ రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎం హిమంత విశ్వ శర్మ అన్నారు.