Lalit Jha | న్యూఢిల్లీ : పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడితో దేశం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. లలిత్ ఝా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయితే ఈ దాడి ప్రధాన వ్యూహకర్త లలిత్ ఝా అని పోలీసులు అనుమానిస్తున్నారు. లలిత్ చివరిసారిగా ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్రానాలో కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస వంటి అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్పై దాడి చేయాలని లలిత్ ఝా నేతృత్వంలోనే కుట్ర జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 22 ఏండ్ల క్రితం డిసెంబర్ 13వ తేదీనే ఉగ్రవాదులు పార్లమెంట్పై దాడి చేసి 9 మందిని పొట్టన పెట్టుకున్న రోజునే ఈ కలర్ స్మోక్ దాడి చేయాలని లలిత్ నిర్ణయించినట్లు తెలిసింది. లలిత్ సూచనల మేరకు మిగతా ఐదుగురు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కోల్కతా చెందిన లలిత్ వృత్తిరీత్యా టీచర్. భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకున్న లలిత్.. తాను దేశం దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. ఇక లలిత్కు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేనట్లు సమాచారం.
లలిత్ ఝా నిన్న ఉదయం సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, విక్కీ శర్మను గురుగ్రామ్కు పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం దాడికి పాల్పడ్డారు. వీరిలో నలుగురు కలర్ స్మోక్ను కలిగి ఉన్నారు. అయితే శర్మ, మనోరంజన్కు మాత్రమే విజిటర్ పాసులు కలిగి ఉండటంతో వారిద్దరు మాత్రమే లోక్సభ విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లగలిగారు. ఇక పార్లమెంట్ బయట కలర్ స్మోక్ను వదిలిన అనంతరం వీడియోను చిత్రీకరించి, సోషల్ మీడియాలో విడుదల చేసి లలిత్ పారిపోయినట్లు తెలిసింది. సాగర్, మనోరంజన్, నీలం, అమోల్ ఫోన్లను లలిత్ తన వద్ద ఉంచుకుని పరారీ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.