న్యూఢిల్లీ, డిసెంబర్ 9: నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో త్రివిధ దళాలను సమన్వయం చేసే దళపతి, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడమేంటి? వీవీఐపీల ప్రయాణాలకు ఎంతో సురక్షితమైనదిగా పేరొందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూలిపోవడం ఏంటి..? వాతావరణం బాగానే ఉంది.. సుశిక్షితులైన పైలట్లు ఉన్నారు.. మరేమైంది? బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ నిజంగానే ప్రమాదానికి గురైందా.. లేదా ఏదైనా కుట్ర ఉందా..? ఇప్పుడు దేశ ప్రజలందరి మనసులను తొలిచేస్తున్న అనుమానం ఇది. హెలికాప్టర్ నడపడంలో అనుభవం ఉన్నవారు.. సైన్యంలో దశాబ్దాలుగా సేవలందించిన వారు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంతో అధునాతన యుద్ధ సామగ్రిని వాడుతున్నామని చెప్పుకొంటాం. మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది’ అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి దీనిపై వివరణ ఇవ్వాలని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. మరోవైపు, ప్రమాదంపై సుప్రీం కోర్టు జడ్జి చేత దర్యాప్తు చేయిస్తేనే నిజాలు తెలుస్తాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడానికి, 2020 జనవరిలో తైవాన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, జనరల్ షేన్ యీ-మింగ్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడానికి మధ్య పోలికలున్నాయని చాలా మంది గుర్తు చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదం వెనుక చైనా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అమెరికాకు చెందిన యూహెచ్-60ఎం బ్లాక్ హాక్ హెలికాప్టర్లో షేన్ మరో ఏడు మంది ప్రయాణిస్తుండగా, తైపీ సమీపంలో కొండల్లో అది కూలిపోయింది. దీని వెనుక చైనా ఉందని అనుమా నిస్తున్నారు.
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాద ఘటనను తైవాన్తో పోల్చిన వారిలో ప్రముఖ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ కూడా ఉన్నారు. ‘ఈ రెండు ఘటనల్లో చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సైనికాధినేతలే ప్రాణాలు కోల్పోయారు’ అని బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అయితే రెండు ప్రమాదాలు ఒకేలా ఉన్నప్పటికీ రెండింటి మధ్య సంబంధం ఉంటుందని చెప్పలేమని పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ చెల్లానీ ట్వీట్ను వక్రీకరించింది. ‘రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొన్నందుకు గాను అమెరికానే ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఉందని చెలానీ అనుమానిస్తున్నట్టు ఉన్నారు’ అని ట్వీట్ చేసింది.
ఈ ఘటన వెనుక లిబరేషన్ తమిళ్ టైగర్స్(ఎల్టీటీ) ఉండొచ్చని కూడా కొందరు అనుమానిస్తున్నారు. మాజీ బ్రిగేడియర్ సుధీర్ సావంత్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ఐఏతో దర్యాప్తు చేయిస్తే నిజం తెలుస్తుందన్నారు.
హెలికాప్టర్ గాలిలో ఉండగానే మంటలు చెలరేగాయా.. లేక అది చెట్టును ఢీకొన్న తర్వాత క్రాష్ అయిందా అన్నదానిపై కూడా గందరగోళం ఉంది. హెలికాప్టర్ నుంచి మంటలతో ఇద్దరు ముగ్గురు కింద పడుతుండగా చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, హెలికాప్టర్ పడుతున్నట్టుగా వైరల్ అయిన వీడియోలో హెలికాప్టర్కు మంటలు అంటుకున్నట్టు లేదు.
నీలగిరుల్లోని విపరీతమైన మంచు ప్రమాదానికి కారణం కావొచ్చని, పైలట్కు సరిగ్గా కనపడక చెట్టుకు తాకించి ఉంటారని తొలుత భావించారు. కానీ వీడియోల్లో హెలికాప్టర్ చెట్టుకు తాకి పడిపోయినట్టు లేదు. ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకవేళ మంచు దట్టంగా ఉంటే రావత్ అంతటి స్థాయి వ్యక్తి ప్రయాణానికి ఎలా అనుమతి ఇచ్చారు..? హెలికాప్టర్ బయల్దేరే ముందు దాన్ని చెక్ చేశారా.? అన్నీ సరిగ్గా ఉన్నాయా..లేదా అనేది చూసుకొన్నారా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాల్సి ఉంది.