చిక్కమగళూరు, మార్చి 22: వయసు పెరుగుతున్నా పెండ్లి కాకపోవడంతో ఇక తమకు దేవుడే దిక్కు అంటున్నారు కర్ణాటకలోని చిక్కమగళూర్ జిల్లా బ్యాడిగెరె గ్రామ అవివాహితులు! వీలైనంత త్వరగా తమకు మంచి అమ్మాయిని వెతికి పెట్టమని దేవుడికి తమ ‘జాబితా’ను సమర్పించారు.
గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయ హుండీలో సుగి జాత్రా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఈ జాబితాను హుండీలో వేసి దేవుడా నీదే భారం అన్నారు! ఆలయంలోని అజ్జయ్య స్వామి, అన్నపూర్ణేశ్వరిలకు ప్రత్యేక పూజలు చేశారు. పనిలోపనిగా తమ జాబితాను పరదేశప్ప మఠానికి కూడా పంపించారు. ఇలా చేస్తే దేవుడు తమ కోరికలను నెరవేరుస్తాడని పెండ్లికాని ప్రసాదులు నమ్ముతున్నారు. జాబితాలో 25-38 ఏండ్ల వయసు కలిగిన 30 మంది యువకుల పేర్లు ఉన్నాయి.