Bombay High Court : తన కుమార్తెకు తెలివి తక్కువగా ఉన్నదని, కాబట్టి ఆమెకు గర్భస్రావం చేయించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలివి తక్కువగా ఉన్నంత మాత్రాన మహిళలకు తల్లయ్యే హక్కు లేదా..? అని ప్రశ్నించింది. తెలివి తక్కువగా ఉన్న మహిళలు పిల్లలను కనకూడదని చెప్పడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 27 ఏళ్ల గర్భిణి తండ్రి తన కుమార్తె అబార్షన్ చేయించేందుకు అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డ తెలివి తక్కువదని, పైగా ఆమెకు పెళ్లి కాలేదని అందుకు కారణాలుగా చూపించాడు. ఈ పిటిషన్పై జస్టిస్ ఆర్వీ ఘూగే, జస్టిస్ రాజేశ్ పాటిల్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. గర్భిణి మానసిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ముంబైలోని జేజే ఆస్పత్రిలో మెడికల్ బోర్డు సమక్షంలో పరీక్షలు చేయించాలని, జనవరి 8 నాటికి సంబంధిత నివేదికను కోర్టుకు సమర్పించాలని ఇటీవల ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మెడికల్ బోర్డు.. బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్కు నివేదికను సమర్పించింది. గర్భిణి మానసిక స్థితి సరిగానే ఉన్నదని, కాకపోతే ఆమె ఇంటెలిజెన్స్ స్థాయి 75 IQ తో సగటు ఇంటెలిజెన్స్ కంటే తక్కువగా ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం మహిళ గర్భంలో పిండం వయసు 21 వారాలని, గర్భస్రావం చేయడానికి వీలు పడుతుందని పేర్కొన్నది.
మెడికల్ బోర్డు నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. గర్భిణి మానసిక స్థితి సరిగానే ఉందని నిర్ధారణకు వచ్చింది. కేవలం ఆమె ఐక్యూ స్థాయిలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఐక్యూ తక్కువగా ఉందనే కారణంతో ఆమెకు తల్లయ్యే హక్కు లేదనడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. తను గర్భం దాల్చడానికి కారణం ఎవరో కూడా ఆమె చెబుతున్నందున ఆమె తల్లిదండ్రులు అతడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని సూచించింది.
గర్భిణి, ఆమె గర్భానికి కారణమైన వ్యక్తి ఇద్దరూ మేజర్లే కావడం, పైగా తాను ఇష్టపూర్వకంగానే అతడితో రిలేషన్లో ఉన్నానని గర్భిణి చెబుతున్నందున దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది. నిందితుడు గర్భిణిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకోకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. కేసు తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.