ముంబై: బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాశ్రయంలో కలకలం రేగింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఇండిగోకు చెందిన 6E 6045 నంబర్ విమానం శనివారం రాత్రి ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైనట్లు ఇండిగో సంస్థ తెలిపింది. బాంబు బెదిరింపునకు సంబంధించిన అన్ని నియమాలు, పద్ధతులను పాటించినట్లు ఆదివారం పేర్కొంది. తనిఖీ తర్వాత బాంబు బెదిరింపు ఉత్తుదేనని తేలినట్లు చెప్పింది. అనంతరం విమానం అహ్మదాబాద్కు టేకాఫ్ అయినట్లు వెల్లడించింది.
మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించారు. ముంబై విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విమానాశ్రయానికి అందిన బాంబు బెదిరింపు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.