Fadnavis on Rifles Boat | మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో కలకలం సృష్టించిన అనుమానాస్పద బోటు ఘటనలో ఉగ్రవాద కోణం ఏమీ లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఆ బోటు ఒక ఆస్ట్రేలియా పౌరుడిదని చెప్పారు. అందులో ఆస్ట్రేలియా దంపతులు ప్రయాణిస్తున్నారని గురువారం అన్నారు. బోటులో మూడు ఏకే-47 రైఫిళ్లు ముంబై తీరానికి 190 కి.మీ. దూరంలో దొరకడం కలకలం రేపింది. సదరు బోటు ఇంజిన్లో సమస్య తలెత్తడంతో ఆ పడవను వదిలి పెట్టారని ఫడ్నవీస్ మీడియాకు చెప్పారు. కానీ, అందులో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో తెలియలేదన్నారు.
ముంబై తీరానికి 190 కిలోమీటర్ల దూరంలో హరిహరేశ్వర్ బీచ్కు సమీపాన దెబ్బ తిన్న ఒక బోటును కనుగొన్నట్లు మత్స్యకారులు తెలిపారు. అందులో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, కొన్ని పత్రాలు దొరికాయి. ఈ సమాచారం తెలియగానే రాయ్గఢ్ జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు.
ఇప్పటికైతే ఈ ఘటనలో ఎటువంటి ఉగ్రవాద కోణం లేదని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కానీ, దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. ఇప్పటికిప్పుడూ ఏ అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు. తాను ప్రాథమిక దర్యాప్తు సమాచారాన్ని మాత్రమే షేర్ చేశానని, అలాగని ఆందోళన చెందాల్సిందేమీ లేదని చెప్పారు.
పడవలో ఆయుధాలు ఎందుకు ఉన్నాయన్న విషయమై తామేమీ స్పందించలేమని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదించామన్నారు. వారు కూడా దీన్ని ధృవీకరించారన్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పౌరుడు హనా లాండర్గన్కు చెందిన పడవలో హన్ అనే మహిళ, ఆమె భర్త జేమ్స్ హర్బర్ట్.. మస్కట్ మీదుగా యూరప్ బయలుదేరారని ఫడ్నవీస్ వెల్లడించారు. జూన్ 26న ఇంజిన్లో సమస్య తలెత్తడంతో పడవలో ఉన్న సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఆస్ట్రేలియా దంపతులు కూడా ఆ పడవను వదిలి పెట్టారని చెప్పారు. దీంతో ఆ పడవ నేరుగా హరిహరీశ్వర్ కోస్తా తీరానికి చేరుకుందన్నారు.