న్యూఢిల్లీ: ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు (Board Exams Twice) జరుగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్కు అనుగుణంగా బోర్డు పరీక్షలు రాయవచ్చు. అలాగే రెండు బోర్డు పరీక్షలు రాసిన వారు ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ మార్కులను ఎంపిక చేసుకోవచ్చు. 11, 12వ తరగతి విద్యార్థులు విధిగా రెండు భాషలను అభ్యసించాలి. వీటిలో ఒకటి తప్పనిసరిగా భారతీయ భాష అయ్యి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) అనుసరించి విద్యా వ్యవస్థలో చోటుచేసుకోనున్న కీలక మార్పుల గురించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న బోర్డు పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తద్వారా విద్యార్థులకు తగినంత సమయం, బాగా రాసేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది.
కాగా, విద్యార్థులు బట్టీపట్టి గుర్తించుకుని పరీక్షలు రాసే విధానానికి పూర్తి వ్యతిరేకంగా కొత్త పరీక్షల విధానం ఉంటుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తిగా పట్టు సాధించిన సబ్జెక్టులను ముందుగా బోర్డు పరీక్షల్లో రాసుకోవచ్చని, అలాగే బెస్ట్ మార్కులను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారం 11, 12 తరగతులలోని సబ్జెక్టుల ఎంపిక కేవలం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కాదని చెప్పింది. 2024 అకడమిక్ సెషన్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఈ మేరకు రూపొందించినట్లు వెల్లడించింది.
మరోవైపు ‘ఆన్ డిమాండ్’ పరీక్షలను నిర్వహించే సామర్థ్యాన్ని స్కూల్ బోర్డులు నిర్ణీత గడువులోగా అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించేవారు, మూల్యాంకనం చేసేవారు సంబంధిత యూనివర్సిటీ గుర్తింపు కోర్సులను విధిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.