Blast in Punjab | పంజాబ్లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో పేలుడు జరిగింది. ఆఫీసు మూడో అంతస్తులో జరిగిన పేలుడుతో ఆఫీసు తలుపులు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు పదార్థాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాకెట్ లాంఛర్లతో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర పోలీసు, పౌర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
పేలుడుకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఉగ్రవాద దాడి అన్న కోణాన్ని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేస్తున్నాయని సమాచారం. మొహాలీలో పంజాబ్ పోలీస్ ప్రధాన కార్యాలయం ఉంది. పేలుడు జరిగిన భవనం సమీపంలో సుహానా సాహెబ్ గురుద్వారా ఉన్నది. సమీప భవనాలు కూడా పేలుడు వల్ల దెబ్బ తిన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ఆఫీసులో ఉన్న పదార్థాల వల్లే పేలుడు సంభవించిందని అనుమానాలు ఉన్నాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర డీజీపీతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనునిత్యం పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సంప్రదిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతర సీనియర్ పోలీసు అధికారలుతో కలిసి చండీగఢ్ ఎస్సెస్పీ కుల్దీప్ చాహల్ ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.