లక్నో : గతేడాది సెకండ్ వేవ్లో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కలవరానికి గురి చేస్తున్నది. ప్రస్తుతం పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్తో గత సోమవారం ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్ ఫంగస్ అతనికి కన్ను, ముక్కుకు వ్యాపించింది. కరోనా థర్డ్ వేవ్లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా జీఎస్వీఎం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కలా మాట్లాడుతూ.. కాంట్ ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని, అతనికి మధుమేహం ఉందని పేర్కొంది.
కంటిలో నొప్పి ఉంటుందని తెలిపారు. అయితే, విచారణలో కరోనా సోకినట్లు తేలింది. షుగర్ కారణంగా బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తిని బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ భారీగా సోకింది. ఫంగస్ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన విషయం విధితమే. మరోసారి కేసులు నమోదవుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.