UP Polls | ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) అరుదైన నిర్ణయం తీసుకున్నది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన తొలి అభ్యర్థిగా ముస్లిం.. హైదర్ అలీఖాన్ను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా సౌర్ నుంచి హైదర్ అలీఖాన్ పోటీ చేస్తారని ఆదివారం తెలిపింది. తొలుత సౌర్ నుంచి హైదర్ అలీఖాన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేర్కొంది. కానీ ఆయన యూ-టర్న్ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ను కలుసుకున్నారు. ఆ తర్వాత తమ అభ్యర్థిగా హైదర్ అలీఖాన్ను అప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం జైలు పాలైన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం పోటీచేస్తారని భావిస్తున్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు అప్నాదళ్, సంజయ్ నిషాద్ సారధ్యంలోని నిషాద్ పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాంపూర్ జిల్లాలోని సౌర్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్).. హైదర్ అలీఖాన్ను అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బీజేపీ మిత్రపక్షంగా అప్నాదళ్ ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించడం అరుదని భావిస్తున్నారు.
హైదర్ అలీఖాన్ తాత రాంపూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన జుల్ఫికర్ అలీఖాన్.. రాంపూర్ నుంచి ఐదు దఫాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. హైదర్ అలీఖాన్ తండ్రి నవాబ్ ఖాసిం అలీఖాన్.. రాంపూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవాబ్ ఖాసిం అలీఖాన్ పోటీ చేయనున్నారు. రాంపూర్ పక్కనే సౌర్ ఉండటం గమనార్హం.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో సౌర్ నుంచి ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం విజయం సాధించారు. కానీ 2019 డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు అబ్దుల్లా ఆజం విజయాన్ని రద్దు చేసింది. 2017 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అబ్దుల్లా ఆజంఖాన్ వయస్సు 25 ఏండ్ల లోపే కావడంతో ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొన్నది.