Infighting in Tripura BJP | త్రిపురలోని అధికార బీజేపీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. శనివారం అకస్మాత్గా సీఎం బిప్లవ్దేవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం.. ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడు మాణిక్ సహాను సీఎంగా బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ.. అన్ని ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపించలేదు.
అగర్తలలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంగా మాణిక్ సహా అభ్యర్థిత్వాన్ని మంత్రి రాం ప్రసాద్ పాల్ వ్యతిరేకించారు. ఇతర ఎమ్మెల్యేలతో వాడీవేడీగా వాగ్వాదానికి దిగారని సమాచారం. కొన్ని కుర్చీలు కూడా విరగ్గొట్టారని తెలుస్తున్నది. నేను చనిపోతా అని పదేపదే కేకలేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న త్రిపుర రాజ కుటుంబ వారసుడు జిష్ణుదేవ్ వర్మను సీఎంను చేయాలని రాం ప్రసాద్ పాల్ చెప్పారని వార్తలొచ్చాయి.
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమను ఎవరూ సంప్రదించలేదని, కేంద్ర నాయకత్వం తమపై బలవంతంగా నిర్ణయం రుద్దిందని నిరసన తెలిపినట్లు వినికిడి. బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి పర్యవేక్షకులుగా సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డే హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎంగా రాజీనామా చేసిన బిప్లవ్దేవ్ కుమార్కు నూతనసీఎంగా ఎంపికైన మాణిక్ సహా అత్యంత సన్నిహితుడు.