న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటుతాయని బీజేపీ చెప్పుకోవడం ఓ జోకు అని కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) అన్నారు. 300 సీట్లు దాటడం కూడా అసాధ్యమని, ఆ పార్టీ 200 సీట్లకే ఛాలెంజ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికే తన ఓటమిని అంగీకరించిందన్నారు. మీడియాతో మాట్లాడిన ఎంపీ శశిథరూర్.. కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. 2019లో దక్షిణ భారత్లో వచ్చిన సీట్ల కన్నా తక్కువే సీట్లను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. తిరువనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన శశిథరూర్.. బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ అభ్యర్థి రవీంద్రన్కు గట్టి పోటీ ఇచ్చారు. ఏప్రిల్ 26వ తేదీన ఆ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తిరువనంతపురం నుంచి తాను ఈజీగా గెలవనున్నట్లు థరూర్ వెల్లడించారు. ఈసారి గెలిస్తే ఆయన నాలుగో సారి వరుసగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పటి వరకు 190 స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయని, వాటిల్లో ఎక్కువ శాతం తమకే అనుకూల ఫలితాలు వెలుబడే ఛాన్సు ఉన్నట్లు చెప్పారు.