హనుమంతుడు కోపిష్టా..?
శాంత మూర్తులను మార్చేసిన బీజేపీ
ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఫైర్
రాయ్పూర్, మే 9: శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నారు. దేశంలో రెచ్చగొట్టే జాతీయవాదానికి బీజేపీ పాల్పడుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాముడిని వాళ్లు రాంబోగా మార్చేశారు. హనుమంతుడు అంటే భక్తిభావంతో ధ్యాన ముద్రలో ఉండేవారు.
ఆయన్ని కోపం, దూకుడుతనం కలిగిన వ్యక్తిగా బీజేపీ, ఆరెస్సెస్ చిత్రీకరిస్తున్నాయి’ అన్నారు. ప్రస్తుతం రెచ్చగొట్టే జాతీయవాదాన్ని సమాజం ఎదుర్కొంటున్నదన్న బఘేల్.. దీనికి బీజేపీనే కారణమని ఆరోపించారు. ఏప్రిల్లో పలు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయని, వాటికి వ్యతిరేకంగా ప్రశ్నించిన గొంతుకలను బీజేపీ అణిచివేయడానికి ప్రయత్నించిందన్నారు. ఈ హింసాత్మక, అణిచివేత ధోరణిని ప్రజలు అర్థం చేసుకొన్న రోజు బీజేపీ ఆటలకు ఎండ్కార్డ్ పడుతుందన్నారు.