న్యూఢిల్లీ, ఆగస్టు 29: తమ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేను బీజేపీ నేతలు కొనలేరని, ఢిల్లీలో కమలనాథులు చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ ఫెయిల్ అయిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేల విధేయత, విశ్వసనీయతను తెలియజేసేందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. కేంద్రంలోని ప్రస్తుత మోదీ సర్కారు అత్యంత అవినీతిమయ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నులను పెంచుతూ.. అలా వచ్చిన డబ్బుతో విపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదని దుయ్యబట్టారు. మరో 15 రోజుల్లో జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కమలదళం సిద్ధమైందని ఆరోపించారు. జార్ఖండ్లో ప్రభుత్వం కూలిపోగానే.. పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో అప్పుడు అందరికీ అర్థమవుతుందన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చినట్టు, ఢిల్లీ సర్కారును బీజేపీ కూల్చేయలేదన్నారు.
రాత్రంతా పోటాపోటీ నిరసనలు
పెద్ద నోట్ల రద్దు సమయంలో.. రూ. 1400 కోట్ల విలువైన రైద్దెన నోట్లను మార్చాలంటూ ఎల్జీ వీకే సక్సేనా బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ ఆరోపించారు. ఆ సమయంలో సక్సేనా కేవీఐసీ ఛైర్మన్గా ఉన్నట్టు గుర్తుచేశారు. దీనిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం రాత్రి అంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసనలు చేపడుతామని ఆప్ నేతలు ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కూడా రాత్రంతా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగుతామని బీజేపీ నేతలు వెల్లడించారు.