BJP MP Ramesh Bidhuri | న్యూఢిల్లీ : పార్లమెంట్లో సహచర ఎంపీని ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ బీజేపీ ఎంపీ బిధూరీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం బిధూరీకి ఇదేమీ మొదటి సారు కాదు, లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా అతడ్ని హెచ్చరించి వదిలేయటం కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి బిధూరీ వెళ్లగక్కిన విద్వేషం.. ఓ వీధి రౌడిని తలపిస్తున్నదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అవమానకరమైన ఘటనగా ‘జమాతే ఉలేమా-ఇ-హింద్’ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలోనూ వివిధ రాజకీయ పార్టీలు, నాయకులపై బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సామాజిక మాధ్యమంలో నెటిజిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మరుగుజ్జు దుర్యోధనుడితో పోల్చుతూ బిధూరీ ట్విట్టర్లో ఇటీవల సందేశాన్ని పోస్ట్ చేశారు. 2017లో మథురా ఎన్నికల సభలో మాట్లాడుతూ, ‘5 నుంచి 7 నెలల్లో పిల్లాడికి జన్మనిచ్చే సంస్కృతి మాయావతి ఇంట్లోనో, సోనియా కుటుంబంలోనో ఉండొచ్చు. ఇండియాలో లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిధూరీ తమపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఐదుగురు మహిళా ఎంపీలు 2015లో లోక్సభలో ఫిర్యాదు చేశారు.