లక్నో, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అల్లర్ల కేసు (2013)లో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీకి రెండేండ్ల జైలుశిక్ష పడింది. ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందికి జైలు శిక్ష విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అల్లర్లు, ఇతర నేరాల్లో దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక జడ్జి గోపాల్ ఉపాధ్యాయ వారికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున జరిమానా కూడా విధించారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 15 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 2013 ఆగస్టు 27న ముజఫర్నగర్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘర్షణల్లో కావల్ గ్రామానికి చెందిన గౌరవ్, సచిన్ అనే యువకులను కొందరు కొట్టి చంపారు. వీరి అంత్యక్రియలు నిర్వహించి, తిరిగి వస్తుండగా జరిగిన హింసాకాండలో ఈ 12 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.