కర్ణాటక సీఎం బస్వరాజ్ ఎస్ బొమ్మై పనితీరుపై బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉందా.. సీఎంను మార్చాలని యోచిస్తున్నదా? వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరింత శక్తిమంతమైన నేతను సీఎంను చేయనున్నదా? అన్న వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా పలుకుబడి గల పంచామశాలీ లింగాయత్ సామాజిక వర్గ నేతను సీఎంను చేసే అవకాశం ఉందని సమాచారం. దళితుడ్ని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించే ఆలోచన కూడా బీజేపీ అధిష్ఠానం చేస్తున్నట్లు తెలియవచ్చింది.
బస్వరాజ్ బొమ్మై పనితీరు పట్ల బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నదని అధికార వర్గాల కథనం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. కర్ణాటక సీఎం బొమ్మై భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. బస్వరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలోని హనగల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల అధి నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుందని వినికిడి.
పరిస్థితులు ఇలాగే ఉంటే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధిష్టానం మదిలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తున్నది. సీఎం బొమ్మైపై పలువురు రాష్ట్ర మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో రోజురోజుకు వ్యతిరేకంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సారధ్యం వహించేందుకు యంగ్ తరంగ్ మంత్రం జపిస్తున్నట్లు వినికిడి. పంచమశాలీ లింగాయత్ సామాజిక వర్గం వారితోపాటు దళిత నేతను బరిలో నిలుపాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది.
మరోవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీనియర్ మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, మురుగేశ్ నిరానీ, సీసీ పాటిల్, ప్రభు చౌహాన్లను తప్పించేస్తారని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే 4 మంత్రిత్వశాఖలు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం 40 మంది ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారని వినికిడి. ఈ నాలుగు స్థానాలు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికి ఈ స్థానాలను కేటాయిస్తారని చర్చ జరుగుతున్నది. తొలుత సీఎంను మార్చేసి, తరవాత క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వినికిడి.