భోపాల్: సీఎంకు మద్దతుగా నినాదాలు ఇస్తూ, కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ బీజేపీ నేత ఒకరు స్టేజ్ నుంచి కిందపడ్డారు. మధ్యప్రదేశ్ ఖార్గోన్ జిల్లాలోని చైన్పూర్లో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల విజయం కోరుతూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం చౌన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అయితే సీఎం చౌహాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే బీజేపీ నేత జగదీష్ జైస్వాల్ మైక్లో ఆయనకు మద్దతుగా నినాదాలు ఇస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా స్టేజ్ అంచున ఉన్న ఆయన ఆ విషయాన్ని గ్రహించక స్టేజ్ పైనుంచి కింద పడ్డారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లేవనెత్తారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పలు ఈమోజీలతో భిన్నంగా స్పందించారు.