న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ను బరికిలోకి దింపింది. భవానీపుర్తోపాటు మరో రెండు నియోజకవర్గాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 41 ఏళ్ల ప్రియాంక తిబ్రీవాల్ కోల్కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2014లో ఎంపీ బాబుల్ సుప్రియో నేతృత్వంలో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓడిపోయిన విషయం తెలిసిందే. బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్ నుంచి పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె 1900ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆమె ఏ సభకూ ఎన్నిక కాకుండానే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు.
కాగా, మమత.. ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నికకావాల్సిన ఉంది. దీంతో భవానీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోబన్దేవ్ చటోపాధ్యాయ్.. మమతా బెనర్జి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత శనివారం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న ఓట్లను లెక్కిస్తారు.