చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే మంత్రి కారుపై బీజేపీ కార్యకర్తలు శనివారం చెప్పు విసిశారు. ఈ సంఘటనపై స్పందించిన బీజేపీ, మదురై జిల్లా అధ్యక్షుడు పీ శరవణన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయనపై ఆదివరం ఈ మేరకు చర్యలు తీసుకుంది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన రైఫిల్మ్యాన్ డీ లక్ష్మణ్ చనిపోయారు. శనివారం మదురై ఎయిర్పోర్ట్కు చేరిన ఆయన మృతదేహానికి తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఆ జిల్లా కలెక్టర్, మదురై మేయర్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నివాళి అర్పించారు.
కాగా, అక్కడకు తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా నివాళి కోసం తమను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రొటోకాల్ నిబంధనలు ఉంటాయంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు, ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్యకర్త తన చెప్పును మంత్రి కారుపైకి విసిరింది. అది కారు అద్దం వద్ద పడింది. వెంటనే స్పందించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను పక్కకు లాగారు. మంత్రి కారుపై చెప్పు విసిరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
మరోవైపు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ బీజేపీ తీరుపై మండిపడింది. మరణించిన జవాన్కు నివాళి అర్పించే కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నించడంపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర యంత్రాంగం స్పందించింది. ‘పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు, పార్టీకి చెడ్డపేరు తెచ్చినందుకు బీజేపీ మదురై జిల్లా అధ్యక్షుడు శరవణన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం’ అని ఆదివారం పేర్కొంది.
కాగా, ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ను కలిసి జరిగిన దానికి ఆయనకు క్షమాపణలు చెప్పినట్లు పీ శరవణన్ మీడియాతో అన్నారు. ఈ ఘటనపై తాను చాలా అసంతృప్తి చెందినట్లు చెప్పారు. పార్టీ పదవి కన్నా మానసిక ప్రశాంతత ముఖ్యమన్న ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంకేలో చేరికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఆ పార్టీలో చేరితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అయితే డీఎంకే పార్టీ నేత అయిన శరవణన్ పేరును 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి తొలగించారు. దీంతో ఆయన డీఎంకేను వీడి బీజేపీలో చేరారు.