శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్నాగ్, షోపియాన్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో షోపియాన్లోని హిర్పోరా ప్రాంతంలో మాజీ సర్పంచ్, బీజేపీ నాయకుడు ఐజాజ్ షేఖ్ను కాల్చివేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతు అతడు మృతిచెందారు.
అరగంట వ్యవధిలోనే అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం వద్ద పర్యటకుల శిబిరంపై కాల్పులు జరిపారు. దీంతో రాజస్థాన్కు చెందిన ఓ జంట గాయపడ్డారు. యన్నర్లోని పర్యాటకుల రిసార్టు వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంత్నాగ్, షోపియాన్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | J&K: Visuals from outside the residence of BJP leader and ex-Sarpanch Aijaz Ahmad Sheikh, who was shot dead by terrorists yesterday in Heerpora, Shopian. https://t.co/GF4LTK64r4 pic.twitter.com/6OHuDr3U0q
— ANI (@ANI) May 19, 2024
కాగా, ఐదో దశ ఎన్నికలకు ముందు వరుస ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం బారాముల్లా జిల్లాలో పోలింగ్ జరుగనుంది. అనంత్నాగ్లోని రాజౌరీ లోక్సభ స్థానానికి మాత్రం మే 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో వాయిదా పడింది. ఆ పోలింగ్ను మే 25వ తేదీకి వాయిదా పడింది. మరోవైపు ఈ ఘటనను బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఖండించాయి.