Lucknow | యూపీ బీజేపీ కష్టకాలంలో ఉంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు,. ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. మరి కొందరు కూడా ఇదే బాటలో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. టిక్కెట్ల పంపిణీ ఓ వైపు, పార్టీలోని అసంతృప్తుల వ్యవహారంతో పాటు పార్టీని వీడిపోతున్న వారు.. ఇలా… పార్టీ మొత్తం గడబిడగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ మెడపై మిత్రపక్షాలు కత్తిపెడుతున్నాయి. తమకు కావాల్సిన సీట్ల విషయంలో సిగపట్లు పడుతున్నాయి. తమ పంతం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో బీజేపీకి ఎటూ పాలుపోవడం లేదు. సరిగ్గా ఈ సమయంలో అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్, ఆయన కుమారుడు ప్రవీణ్ నిశాద్ కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలుసుకున్నారు.
తమకు కావాల్సిన సీట్లతో పాటు కొన్ని అదనంగా కూడా కావాలని పట్టుబట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనుప్రియా పటేల్ 12 కు పైగా సీట్లు కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అందులో సగం సీట్లు యూపీలోని తూర్పు ప్రాంతానివే. బుందేల్ఖండ్ ఈ ప్రాంతం కిందికే వస్తుంది. బుందేల్ ఖండ్లో బీజేపీకి మంచి పట్టుంది. గత లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది. సరిగ్గా ఇదే ప్రాంతంలో కొన్ని సీట్లు కావాలని అప్నాదళ్ పట్టుపడుతోంది. ఒకవేళ… అనుప్రియా పటేల్ డిమాండ్కు తలొగ్గితే, బుందేల్ఖండ్లోని సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తామన్న ఆలోచనో బీజేపీ పడిపోయిందని పేర్కొంటున్నారు.
ఇక మరోవైపు ఎన్డీయే భాగస్వామి నిషాద్ పార్టీ వ్యవహారం కూడా అచ్చు ఇలాగే వుంది. దీంతో పాటు రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, జేడీయూ లాంటి పార్టీలు కూడా సీట్ల విషయంలో బీజేపీపై తెగ ఒత్తిడి పెడుతున్నాయి. 2017 ఎన్నికల్లో అప్నాదళ్కు బీజేపీ 11 సీట్లు కేటాయించింది. అందులో 9 సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు కావాలని అప్నాదళ్ పట్టు పడుతోంది.
ఇక సంజయ్ నిషాద్ నేతృత్వంలోని నిషాద్ పార్టీ ఈసారి రెండెకల్లో సీట్లు కావాలని బీజేపీని డిమాండ్ చేస్తోంది. తామైతే బీజేపీ ముందు ఈ డిమాండ్ను పెట్టామని, మాకు రెండెకల్లోనే సీట్లు లభిస్తాయన్న ఆశాభావంతోనే ఉన్నామని సంజయ్ నిషాద్ నపేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని ఆయన తెలిపారు.