Biometric Attendance | కరోనా మహమ్మారి ఉధృతి తగ్గి సాధారణ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తిరిగి కేంద్రం పునరుద్ధరించింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అన్ని స్థాయిల కేంద్ర ప్రభుత్వోద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసుకోవాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ఆయా బయోమెట్రిక్ యంత్రాల పక్కనే శానిటైజర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉద్యోగులు అటెండెన్స్కు ముందు, తర్వాత తమ చేతులను విధిగా శుభ్రపరచుకునేలా చూసే బాధ్యత ఆయా శాఖలు, విభాగాల చీఫ్లదేనని స్పష్టం చేసింది.
ఇక ఉద్యోగులు తమ బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఫిజికల్గా ఆరడుగుల దూరం పాటించాలి. ఒకే టైంలో ఉద్యోగులు వస్తారు కనుక రద్దీ నివారణకు అవసరమైతే అదనపు బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలని వివిధ శాఖలకు జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది.
ఇక ఉద్యోగులంతా విధిగా ఫేస్మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. ఇక శాఖలో సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్లోనే నిర్వహించాలని సూచించింది. అత్యవసరం లేదా ప్రజా ప్రయోజనాల కోసం తప్ప సందర్శకులతో వ్యక్తిగత భేటీలను నివారించాలని హితవు చెప్పింది.