ఆడ పిల్లల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై 31 మందితో కూడిన ఓ పార్లమెంటరీ ప్యానల్ ఏర్పాటైన విషయం విదితమే. శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం మహిళలకు సంబంధించింది. కానీ.. ఈ ప్యానల్లో ఎంత మంది మహిళా సభ్యులున్నారో తెలుసా? కేవలం ఒకే ఒక్కరు.
తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే ఈ ప్యానల్లో సభ్యురాలు. మిగతా 30 మంది ఎంపీలు పురుషులే కావడం గమనార్హం. ఈ ప్యానల్ బీజేపీ ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే ఆధ్వర్యంలో నడుస్తోంది. రాజ్యసభ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఇందులో ఒకే ఒక్క మహిళా ఎంపీ సభ్యులుగా ఉన్నారు. ఈ విషయంపై తృణమూల్ ఎంపీని సంప్రదించగా… ఈ ప్యానల్లో మరింత మంంది మహిళా ఎంపీలుంటే బాగుటుందని సుస్మితా దేవ్ అభిప్రాయపడ్డారు.